Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మోదీ అబద్ధాలు చెబుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy fires at PM Narendra Modi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముంబైలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్రమోదీ కూడా తెలంగాణలోని ఆరు గ్యారెంటీల అమలుపై మహారాష్ట్రలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే తాము నిజాలు చెబుతూనే ఉంటామని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఆరు గ్యారెంటీలపై నిజాలు చెప్పేందుకే తాను మహారాష్ట్రకు వచ్చానన్నారు.

మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతులకు తమ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని వెల్లడించారు. 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామన్నారు. రుణమాఫీపై వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధమన్నారు.

తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామన్నారు. తాను వివరాలు అందించాక ప్రదాని మోదీ తన ట్వీట్‌ను డిలీట్ చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. 

సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామన్నారు. 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లాయన్నారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News