కుర్చీని కాపాడుకోవడం కోసం హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు: కేటీఆర్
- హైడ్రా వెనుక మంచి ఉద్దేశం ఉంటే బాగుండేదన్న కేటీఆర్
- హైడ్రా ఓ బ్లాక్మెయిల్ దుకాణమని వ్యాఖ్య
- కేసీఆర్ వచ్చాకే భూముల ధరలు పెరిగాయన్న కేటీఆర్
తెలంగాణ గురించి అవగాహన లేనివారు... పరిశ్రమల గురించి అవగాహన లేనివారు నడుపుతున్నట్లుగా హైడ్రా ఉందని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టామని... దానినే ఈ ప్రభుత్వం హైడ్రా అని మార్చిందన్నారు.
హైడ్రా కారణంగా ఈ రోజు ఎవరైనా లేక్ వ్యూ అని పేరు పెట్టాలనుకున్నా భయపడుతున్నారన్నారు. బెదిరింపుల కారణంగా మార్కెట్ మొత్తం ఆగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి పిచ్చి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ పడిపోతోందని.. మార్కెట్ను నాశనం చేశారని విమర్శించారు.
ప్రాజెక్టులకు హైడ్రా క్లియరెన్స్ అని చెబుతున్నారని... కానీ అనుమతులు గాలిలో దీపం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ ప్రకారం 21 రోజుల్లో క్లియరెన్స్ వస్తోందా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ ఢమాల్ అని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తోన్న పనికి ఆదాయం పడిపోయిందని... ప్రాజెక్టులు రద్దయ్యాయని... కొత్త ప్రాజెక్టులూ లేవన్నారు.
కేసీఆర్ వచ్చాక భూముల ధరలు పెరిగాయి
మా తాతకు 400 ఎకరాల భూమి ఉండేదని... కానీ నీళ్లు లేకపోవడంతో ఆ భూమి నిరుపయోగంగా ఉండేదని, భూమికి కూడా విలువ లేకుండెనని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు మేలు చేయాలని నాటి పాలకులు ఆలోచన చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో 2014కు ముందు భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవన్నారు. కేసీఆర్ కృషి వల్లే భూముల ధరలు పెరిగినట్లు చెప్పారు. సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం సాధ్యం కాదని... అప్పుడు సంపద సృష్టి కూడా జరగదన్నారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చామని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. కానీ ఎన్నికలకు ముందు మార్పు... మార్పు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చూడాలన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో... రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టుబడులు రావని భయపెట్టారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రెండు రోజులు పవర్ హాలీడే ఉండేదన్నారు. కానీ కేసీఆర్ వచ్చాక అన్నీ సర్దుకున్నట్లు చెప్పారు.