Rohit Sharma: రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్‌పై ప్రశ్నలు సంధించిన మీడియా... హిట్‌మ్యాన్ సమాధానం ఇదే

Team India captain Rohit Sharma was bound to face some tough questions
  • సీనియర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడం ఆందోళనకరమని అంగీకరించిన కెప్టెన్
  • జరిగిందేదో జరిగిపోయింది.. భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని వ్యాఖ్య 
  • ఆస్ట్రేలియాలో ప్రత్యేక విజయాన్ని సాధించే అవకాశం ఉందని ఆశాభావం
న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్ కారణంగా భారత్ అవమానకర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్లు రిషబ్ పంత్, శుభ్‌మాన్ గిల్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. 

ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తేలిపోయారు. అత్యంత పేలవంగా బ్యాటింగ్ చేశారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇద్దరూ కనీసం 100 కంటే ఎక్కువ పరుగులు సాధించలేకపోయారు. అలా క్రీజులోకి రావడం ఇలా వెళ్లిపోవడం... ఇదే తంతు! పుణే టెస్టులో అయితే కోహ్లీ ఒక ఫుల్ టాస్ బంతిని కొట్టబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టార్ ప్లేయర్లు ఇద్దరిపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఫామ్‌పై ముంబై టెస్ట్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మకు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. 

మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. సీనియర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడం తీవ్ర ఆందోళనకర అంశమని రోహిత్ శర్మ నిస్సంకోచంగా అంగీకరించాడు. ‘‘సీనియర్లు పరుగులు చేయనప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కానీ జరిగిందేదో జరిగిపోయింది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, జట్టుగా అందరం భవిష్యత్‌పై దృష్టిపెట్టాలి. ఇక్కడ మనం సాధించలేకపోయిన దానిని ఎలా సరిదిద్దగలమో చూడాలి. ఏదో ఒక ప్రత్యేకమైనదానిని ఆస్ట్రేలియాలో సాధించే అవకాశం ఉంది’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

ముంబై టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్కోర్లు 18, 4గా, రెండవ ఇన్నింగ్స్‌లో 11, 1గా ఉన్నాయి.
Rohit Sharma
Virat Kohli
Cricket
Team India

More Telugu News