Advertisement

కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy meets VCs today
  • కొత్తగా నియమితులైన వీసీలతో సీఎం సమావేశం
  • వర్సిటీల విశ్వాసం పెంచేలా పని చేయాలని సీఎం సూచన
  • వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్న సీఎం
కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పని చేయాలని కొత్త వీసీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేసి దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని వారికి సూచించారు. ఆయా యూనివర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనానికి అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకోవాలని అన్నారు. వారి సూచనలతో నివేదిక తయారు చేసుకోవాలన్నారు.

ఒత్తిళ్ల ప్రభావంతో వీసీలను నియమించలేదని, ప్రతిభ, సామాజిక సమీకరణాలనే పరిగణలోకి తీసుకుని వీసీలను నియమించామని సీఎం స్పష్టం చేశారు. వీసీలు బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తప్పులు చేస్తే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మంచిపని చేయడానికి వైస్ ఛాన్సలర్లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఎంతోకాలం గుర్తు పెట్టుకునేవారని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు.
Advertisement
Revanth Reddy
Congress
Telangana
VC

More Telugu News