YS Sharmila: 'జగన్ బెయిల్ రద్దు కుట్ర' వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల

Sharmila responds on Jagan bail cancelation arguments
షార్ట్స్‌లో చూడండి
జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతోందని వైసీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల స్పందించారు. షేర్ల బదలాయింపుకు, జగన్ బెయిల్ రద్దుకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. జగన్ బెయిల్ రద్దు కుట్ర వ్యాఖ్య ఈ శతాబ్దపు జోక్ అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని, రూ.32 కోట్ల విలువ చేసే కంపెనీ స్థిరాస్తిని మాత్రమేనని వెల్లడించారు. షేర్ల బదలాయింపుపై ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. కాబట్టి ఈ బదలాయింపుకు బెయిల్ రద్దుకు సంబంధం లేదన్నారు.

గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, కాని వాటి ట్రేడింగ్, బదిలీలను మాత్రం దర్యాఫ్తు సంస్థ ఆపలేదని వెల్లడించారు. ఈడీ అటాచ్ చేసింది కాబట్టి షేర్లు బదిలీ చేయకూడదన్న వైసీపీ వాదనలో పస లేదన్నారు. అయినా 100 శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూలో జగన్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఆరోజు సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దవుతుందనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

షేర్ల బదిలీపై ఆంక్షలే ఉంటే... 2021లో రూ.42 కోట్లకు క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా విక్రయించారు? బెయిల్ రద్దవుతుందని నాడు షేర్లు విక్రయించినప్పుడు తెలియదా? అలా అమ్మడం స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా? షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని వారికి కూడా తెలుసునన్నారు. షేర్లను విక్రయించి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. షేర్లు బదిలీ చేస్తే జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు కూడా తెలుసునన్నారు.
Go Back to Shorts
YS Sharmila
YS Jagan
Andhra Pradesh
CBI
ED

More Telugu News