హత్య జరిగిన తర్వాత మృతుడి ఇంటికి పినిపె విశ్వరూప్ వెళ్లారు: మంత్రి వాసంశెట్టి సుభాష్

Vasamsetti Subhash comments on Pinipe Viswarup
  • దుర్గాప్రసాద్ హత్య వెనుక శ్రీకాంత్ ప్రమేయం ఉందన్న వాసంశెట్టి
  • దర్యాప్తు సాగకుండా మంత్రి పదవితో విశ్వరూప్ అడ్డుకున్నారని ఆరోపణ
  • హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య వెనుక మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ హస్తం ఉందని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. హత్య జరిగిన తర్వాత దుర్గాప్రసాద్ ఇంటికి విశ్వరూప్ వెళ్లారని తెలిపారు. కేసు పెట్టకుండా ఉంటే రెండెకరాల భూమిని ఇస్తానని కుటుంబ సభ్యులకు చెప్పారని అన్నారు. హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా తన మంత్రి పదవితో అడ్డుకున్నారని చెప్పారు. 

శ్రీకాంత్ తో దుర్గాప్రసాద్ కు అనుబంధం ఉండేదని సుభాష్ తెలిపారు. తన కొడుకుకి శ్రీకాంత్ అనే పేరు కూడా పెట్టుకున్నాడని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ధైర్యం వచ్చిందని... ఈ కేసులో న్యాయం చేయాలని తన వద్దకు వచ్చి కోరారని తెలిపారు. వారిని తాను పోలీసు ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లానని చెప్పారు. హత్య కేసును విచారించి, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Advertisement
Vasamsetti Subhash
Telugudesam
Pinipe Viswarup
Pinipe Srikanth
YSRCP

More Telugu News