తిరుమలలో రూ.13.40 కోట్లతో వకుళమాత వంటశాల... ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurates Vakula Matha Kitchen
  • వకుళమాత వంటశాల ద్వారా రోజుకు 1.25 లక్షల మందికి ఆహారం
  • తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామన్న చంద్రబాబు
  • భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వెల్లడి
తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రోజుకు 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 

18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని తెలిపారు. తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని... శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. 

"ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది... ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నాడు రెండు, మూడు వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత క్రమబద్ధీకరణ చేస్తాం. క్యూ లైన్ల నిర్వహణను కూడా రిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్ మెంట్ లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారు’’ అని సీఎం అన్నారు.

భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు

టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం... రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటాం. ఇక్కడ అటవీపరంగా జీవ వైవిధ్యానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. 

తిరుమల ఎప్పుడూ భక్తులకు దివ్య క్షేత్రంగా ఉంటుంది. భక్తల మనోభావాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుంది. శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. తిరుమలలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం. దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. 

లడ్డు ప్రసాదంతో పాటు, అన్నప్రసాదం, ఇతర ప్రసాదాల్లో రాబోయే రోజుల్లో పరీక్షలు ఉంటాయి. నేను నిద్ర లేచిన సమయంలోనైనా, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరస్వామిని తలచుకుంటాను. తిరుమల కొండపై పని చేసేవారు, కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలి. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువు... ఆ ఎకో సిస్టం కాపాడతాం. 

ఆ విషయంలో రాజీ పడేది లేదు

శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీపడం. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదు. ముడిసరుకుల నుండి, ప్రసాదం బయటకు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు... దీనికి పేటెంట్ కూడా ఉంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉంది... అని చంద్రబాబు వివరించారు. 
Go Back to Shorts
Chandrababu
Vakula Matha Kitchen
Anna Danam
Tirumala
TTD
TDP-JanaSena-BJP Alliance

More Telugu News