ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు ..ఏకంగా 16మంది విఆర్‌కు ఆటాచ్

  • ఇసుక అక్రమ దందా నియంత్రణలో విఫలమైన పోలీసులపై వేటు
  • ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు పంపిన జోన్ – 2 ఐజీ
  • నిఘా వర్గాల నివేదిక, విచారణల అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
ఇసుక అక్రమ దందాను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మల్టీ జోన్ – 2 పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో బాధ్యులను గుర్తించి వారిపై వేటు వేశారు. ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ (విఆర్)కు పంపించారు. ఈ మేరకు జోన్ ఐజీపీ వి.సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు, విచారణల అధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వేటు పడిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్స్‌పెక్టర్‌లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు.

గతంలో ఇదే వ్యవహారంలో ఒక ఇన్స్‌పెక్టర్, 14 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వీరిలో కొందరు ఇసుక అక్రమ దందా ముఠాలతో చేతులు కలిపినట్లు గుర్తించారు. ఇసుక అక్రమ రవాణాలో వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొండమల్లేపల్లి హోంగార్డు, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్‌ను ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వుడ్ కార్యాలయాలకు అటాచ్ చేశారు.


More Telugu News

Telangana illegal sand Quarrying Telangana news Telangana police