మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

judgment reserved on nandigam suresh bail petition
  • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్
  • దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరిన పోలీసుల తరపు న్యాయవాదులు
  • ఈ నెల 4వ తేదీన బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్, మరో నిందితుడు అవుతు శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ సమయంలో బెయిల్ ఇస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని, దాడి ఘటనలో సురేశ్ పాత్ర ఉందని, ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని ప్రత్యక్ష సాక్ష్యులు, సహ నిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. సురేశ్ సెల్ ఫోన్ ను అప్పగించాలని పోలీసులు కోరినా ఇవ్వలేదని చెప్పారు.

సురేశ్‌కు నేరచరిత్ర ఉందని, మేజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వారి బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పి వీరారెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్లపై కేసు పెట్టారని, ఇప్పటికే పోలీసు కస్టడీలో వారిపై విచారణ ముగిసిందన్నారు. ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో ఈ నెల 4న తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ తెలిపారు.
Go Back to Shorts
AP High Court
Nandigam Suresh
TDP Office

More Telugu News