నస్రల్లాను తుదముట్టించిన ఆపరేషన్ జరిగిందిలా.. వీడియో ఇదిగో!
- హిజ్బొల్లా చీఫ్ టార్గెట్ గా బాంబు దాడులు
- విమానంలో అమెరికా వెళుతూ అధికారులతో నెతన్యాహు చర్చలు
- ఐరాస లో ప్రసంగానికి ముందు అనుమతినిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
నస్రల్లా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను వాయిదా వేస్తూ వచ్చింది. నెతన్యాహు మంత్రివర్గంలో కొంతమంది వ్యతిరేకించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, సోమవారం మొదలైన ఆపరేషన్ ప్లానింగ్ బుధవారం జోరందుకుందని సమాచారం. ఐరాస సమావేశాల కోసం నెతన్యాహు అమెరికా వెళుతూ విమానంలో కూడా దీనిపై చర్చలు జరిపారట.. ఇక న్యూయార్క్ లో జరిగిన జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న నెతన్యాహు.. సభలో ప్రసంగించే ముందు నస్రల్లాపై బాంబు దాడికి బలగాలకు అనుమతిచ్చారు.
లెబనాన్ లో నస్రల్లాపై దాడులు చేయడానికి హామర్స్ స్క్వాడ్రన్ ఎఫ్ -15 రామ్ ఫైటర్ జెట్స్ ను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ ను నియమించారు. బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవనె పర్యవేక్షణలో హామర్స్ స్క్వాడ్రన్ ఆపరేషన్ న్యూ ఆర్డర్ చేపట్టింది. హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు ఎఫ్ - 15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్ పై సెకనుకు రెండు బాంబుల చొప్పున 80 బాంబులను జార విడిచాయి. దీంతో క్షణాలలోనే ఆరు భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. అమెరికా సమకూర్చిన బాంబులనే ఈ దాడిలో వాడినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన బీఎల్ యూ -109 బాంబులకు జేడామ్ ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చి దాడి చేశారు. ఆపై సాయంత్రం వేళలో ఫైటర్ జెట్లు హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి.