ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ
- తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
- వాస్తవాలు వెలికితీయాలంటూ ప్రధాని మోదీని కోరిన జగన్
- కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వెల్లడి
- సున్నితమైన అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు
100 రోజుల అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తిరుమల సంప్రదాయాలపై అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తున్నారని వివరించారు.
ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని జగన్ తన లేఖలో విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పదవికి అప్రదిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని మోదీని కోరారు.