తిరుమల లడ్డూ వివాదం.. స్పందించిన అమూల్

Amul Responds About Tirumala Laddu Row
  • టీటీడీకి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదన్న అమూల్
  • తాము స్వచ్ఛమైన పాలతో అత్యాధునిక యంత్రాలతో నెయ్యి ఉత్పత్తి చేస్తామని వివరణ
  • సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై ఇండియన్ డైరీ బ్రాండ్ అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని వివరణ ఇస్తూ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ‘‘టీటీడీకి మేమే నెయ్యి సరఫరా చేశామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీకి మేమెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని తెలియజేయాలనుకుంటున్నాం’’అని అమూల్ మాతృసంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) స్పష్టం చేసింది.

 ‘‘అంతేకాదు అమూల్ నెయ్యిని మా అత్యాధునిక ఉత్పత్తి సౌకర్యాలలో పాల నుంచి తీస్తాం. వాటిని ఐఎస్‌వో నిర్ధారించింది. అత్యంత నాణ్యత కలిగిన శుద్ధమైన మిల్క్ ఫ్యాట్ నుంచి అమూల్ నెయ్యిని ఉత్పత్తి చేస్తాం. పూర్తి నాణ్యతా పరీక్షల తర్వాతే తమ డెయిరీలు పాలను తీసుకుంటాయి’’ అని పేర్కొంది. 

తిరుమల స్వామివారి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసే లడ్డూలలో జంతువుల కొవ్వును, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాజకీయంగానూ ఇది దుమారం రేపింది. అన్ని పార్టీల వారు స్పందించారు. అయోధ్య ఆలయం సహా పలు దేవాలయాల అర్చకులు కూడా దీనిపై స్పందించారు. ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ నేపథ్యంలో అమూల్ ఇలా వివరణ ఇచ్చింది.
Go Back to Shorts
Tirumala Laddu
TTD
Amul
GCMMF
Tirupati

More Telugu News