సీఎం కార్యాలయంలో కుట్ర.. హీరోయిన్ ను ముగ్గురు ఐపీఎస్ లు చిత్రహింసలు పెట్టారు: బుద్దా వెంకన్న
- జగన్ ఆదేశాలను పీఎస్సార్ ఆంజనేయులు అమలు చేశారన్న బుద్దా
- పీఎస్సార్ ను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్
- తప్పు చేసిన ఐపీఎస్ లను శిక్షించాలని వ్యాఖ్య
పీఎస్సార్ ఆంజనేయులు గతంలో కూడా ఎంతో మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బుద్దా ఆరోపించారు. గున్నీ స్టేట్మెంట్ ఆధారంగా ఆంజనేయులుని అరెస్ట్ చేసి విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. దీని వెనుకున్న జగన్ పాత్ర కూడా వెలుగు చూస్తుందని అన్నారు. ముగ్గురు ఐపీఎస్ లు ఒక ఆడపిల్లను హింసించడం దారుణమని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు.
గతంలో జగన్ చెప్పినట్టు పోలీసు అధికారుల సంఘం మాట్లాడిందని... ఇప్పుడు కూడా ఈ ముగ్గురు పోలీసుల నిర్వాకంపై స్పందించాలని బుద్దా డిమాండ్ చేశారు. వీళ్లను వదిలేస్తే మళ్లీ ఇలాగే చేస్తారని... వీళ్లను వదిలి పెట్టకూడదని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమకు చెప్పారని... అందుకే తాము సైలెంట్ గా ఉన్నామని చెప్పారు.