ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులను వేలం వేయనున్న కేంద్రం
- పారాలింపిక్స్ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 రకాల వస్తువుల వేలం
- మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వేలం ప్రక్రియ
- వేలం వస్తువుల విలువ 1.5 కోట్లుగా అంచనా
మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సోమవారం మంత్రి షెకావత్ వేలం వేసే వస్తువుల ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ తనకు లభించే అన్ని బహుమతులను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రారంభించారని చెప్పారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలానే చేసేవారని తెలిపారు. ఇలా వేలం నిర్వహించడం ఇది ఆరోసారని వెల్లడించారు. బహుమతుల వేలం ద్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాళనకు గానూ 'జాతీయ గంగానిధి'కి విరాళంగా అందజేస్తామని చెప్పారు.