వయనాడ్‌లో వారిని చూసి చలించిపోయిన ప్రధాని మోదీ... బెయిలీ వంతెనపై నడక

  • సీఎం, కేంద్రమంత్రితో కలిసి పర్యటించిన ప్రధాని మోదీ
  • జీవీహెచ్ఎస్ స్కూల్లో తలదాచుకున్న బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
  • సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించిన ప్రధాని
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు.

ప్రధాని మోదీ కాల్‌పేటలో అడుగిడిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్‌లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు. వారిని చూసిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది పిల్లలు చనిపోయారని ఉద్వేగపూరిత గొంతుతో అడిగారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ స్కూల్ భవనం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న పాఠశాల భవంతిని, అక్కడున్నవారిని చూసి చలించిపోయారు. బాధితుల పునరావాసం గురించి అడిగి తెలుసుకున్నారు.

కొండచరియలు విరిగిపడిన సమయంలో జీవీహెచ్ఎస్ వెల్లర్మల స్కూల్లో 582 మంది విద్యార్థులు ఉండగా ఇందులో 27 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ పాఠశాలలో ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.

బెయిలీ వంతెనను సందర్శించిన మోదీ

ప్రధాని మోదీ భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించారు. ఈ వంతెన గుండా నడిచి, రక్షణ అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆసుపత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Narendra Modi
Kerala
Wayanad

More Telugu News