తెలంగాణలో కటకటాల పాలైన మరో అవినీతి అధికారి .. రూ.కోట్ల నగదు, నగల స్వాధీనం

Nizamabad Revenue Official Caught By ACB
  • నిజామాబాద్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ సోదాలు
  • రూ.6.07 కోట్ల ఆస్తుల స్వాధీనం
  • ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు
తెలంగాణలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసం నుంచి కోట్లాది రూపాయల నగదు, నగలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలో దాదాపు 25 సంవత్సరాలుగా సూపరింటెండెంట్‌గా, ఇన్‌చార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నాగేంద్ర పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఏడాది కాలంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలను తెలుసుకున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్‌లలోని నరేందర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. నిజామాబాద్‌లోని నరేందర్ నివాసంలో ఆరు కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు, నగలను అధికారులు గుర్తించారు. వాటిలో రూ. 2.93 కోట్ల నగదు, రూ. ఆరు లక్షల విలువైన 51 తులాల బంగారు అభరణాలు, రూ.1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తుల పత్రాలు, ఆయన భార్య, తల్లి పేరున బ్యాంక్ ఖాతాల్లో రూ.1.10 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

నాన్ గెజిటెడ్ అధికారి హోదాలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో నగదు, నగలు, స్థిరాస్తులు ఉండటంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసినట్టు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. నరేందర్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గతంలోనూ అవినీతి ఆరోపణలతో నరేందర్ సస్పెండ్ అయ్యారు. 

అసరా పింఛన్ల నగదును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారన్న అభియోగంపై ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఆయనను బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేయగా, రాజకీయ నేతలు, అధికారులతో ఉన్న పరిచయాలతో బదిలీని రద్దు చేయించుకుని నిజామాబాద్ లోనే కొనసాగుతున్నారు.
Go Back to Shorts
ACB
Nizamabad
Revenue Officer

More Telugu News