మా అమ్మ ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదు: షేక్ హసీనా తనయుడు
- షేక్ హసీనాకు అమెరికా వీసా రద్దు చేసిందని ప్రచారం
- తొలుత చేరుకున్న దేశాన్నే ఆశ్రయం అడగాలన్న బ్రిటన్
- తన తల్లి అమెరికా, బ్రిటన్ దేశాలను ఆశ్రయమే అడగలేదన్న సాజిద్ వాజెద్
- అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించలేదనే వార్తల్లో నిజం లేదని వ్యాఖ్య
తన తల్లి ఆశ్రయానికి సంబంధించి మీడియాలో వివిధ కథనాలు వస్తున్నాయని, కానీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తన తల్లి అసలు ఏ దేశం ఆశ్రయం కోరలేదు కాబట్టి అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించలేదని చెప్పడం సరికాదన్నారు. తన తల్లికి ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
ఇదిలావుంచితే, భారత్ నుంచి బ్రిటన్ వెళ్లి తాత్కాలిక ఆశ్రయం పొందాలని షేక్ హసీనా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్నిరోజులు ఆమె భారత్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షేక్ హసీనా సోదరి రెహానా కూతురు తులిప్ సిద్దీఖ్ బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. అందుకే షేక్ హసీనా యూకే వెళ్లాలని భావిస్తున్నారు. అయితే నిన్న బ్రిటన్ హోంమంత్రి మాట్లాడుతూ, శరణార్థిగా వచ్చే వారికి తమ చట్టాలు అంగీకరించవని, అంతర్జాతీయ రక్షణ కోరేవారు తొలుత చేరుకున్న దేశంలోనే ఆశ్రయం అడగాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో షేక్ హసీనాకు అమెరికా వీసా రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హసీనా తనయుడు స్పందించారు.