మాజీ సీఎం జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు
- జగన్ చీటింగ్ బుద్ది మార్చుకోలేదన్న మంత్రి
- రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్న అచ్చెన్న
- వైసీపీ ఆఫీసుకు టు-లెట్ బోర్డు ఖాయమంటూ వ్యాఖ్య
తాజాగా, నంద్యాల, జగ్గయ్యపేటలలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. జనం ఛీకొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. త్వరలో వైసీపీ ఆఫీసుకు టు-లెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని సెటైర్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ ను అయిదేళ్లలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది జగన్ కాదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకూ దాడులు, దౌర్జన్యాలు జరగని రోజే లేదని అచ్చెన్న విమర్శించారు.