మదనపల్లె ఘటనపై వేగం పుంజుకున్న విచారణ

Probe speeds up in Madanapalle incident
  • మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్ధం ఘటన
  • విచారణ జరుపుతున్న సీఐడీ, పోలీసులు
  • గత ఐదురోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్
  • ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు, పోలీసులు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఫైళ్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ అంశంలో కుట్ర కోణం ఉందన్న వాదనలతో ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. డీజీపీ, సీఐడీ చీఫ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మదనపల్లె ఘటనపై దృష్టి కేంద్రీకరించారు. 

కాగా, ఫైళ్ల దగ్ధం ఘటనలో విచారణ వేగం పుంజుకుంది. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అనుమానితుల విచారణ నేడు కూడా కొనసాగింది. సీఐడీ అధికారులు, పోలీసులు పలువురు అనుమానితులను విచారించారు. ట్రాన్స్ కో సిబ్బందిని పిలిపించి ఆరా తీశారు. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీఎస్పీ కార్యాలయంలో విచారణ తీరుతెన్నులను సమీక్షిస్తున్నారు. 

గత మూడ్రోజులుగా రెవెన్యూ శాఖపై సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కొద్దిసేపటి కిందటే మదనపల్లె నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు. 

కాగా, ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్ గత ఐదురోజులుగా పోలీసుల అదుపులో ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది, అనుమానితుల ఫోన్ కాల్ డేటాను సీఐడీ అధికారులు, పోలీసులు పరిశీలిస్తున్నారు.
Go Back to Shorts
Madanapalle
Files
CID
Police

More Telugu News