Uttam Kumar Reddy: టీడీపీ, జేడీయూ పార్టీలను సంతృప్తి పరిచేందుకు తీసుకువచ్చిన బడ్జెట్ లా ఉంది: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు

Uttam Kumar Reddy take a dig at budget
షార్ట్స్‌లో చూడండి
బడ్జెట్ లో ఏపీకి భారీగా కేటాయింపులు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని తామేమీ తప్పుబట్టడంలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు హామీ ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల బృందం గత ఏడు మాసాలుగా నిధులు కేటాయించాలని కోరుతూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

'బీహార్ కు రూ.41 వేల కోట్లు, ఏపీకి రూ.15 వేల కోట్లు ప్రకటించారు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు అందిస్తామన్నారు... కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను మాత్రం పూర్తిగా విస్మరించారు' అంటూ ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు.

దీన్నిబట్టి చూస్తే, ఇది ప్రజల బడ్జెట్ కాదని, రాజకీయ ఉద్దేశాలతో కూడిన బడ్జెట్ అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. జేడీయూ, టీడీపీలను సంతృప్తి పరిచేందుకు తీసుకువచ్చిన బడ్జెట్ లా ఉందని విమర్శించారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Budget
Congress
TDP
JDU
Telangana
Andhra Pradesh
Bihar

More Telugu News