గోదావరికి పోటెత్తుతున్న వరద... సమీక్ష చేపట్టిన మంత్రి పొంగులేటి

  • తెలంగాణలో భారీ వర్షాలు
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
  • జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొంగులేటి 
గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు వల్ల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్లు కూడా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఉప్పొంగుతున్న వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలెవరూ వాగులు దాటకుండా చూడాలని సూచించారు. 

రాష్ట్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, వారిని జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడైనా సంప్రదించవచ్చని మంత్రి పొంగులేటి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Ponguleti Srinivas Reddy
Godavari
Heavy Rains
Review
Congress
Andhra Pradesh

More Telugu News