ఇంటర్నెట్‌లో వీడియోలు చూసే అలా చేశారట.. ముచ్చుమర్రి ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

Shocking things came to light in the Muchumarri incident
  • ఏపీలో సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యం కేసు
  • బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై గొంతు నులిమి చంపేసిన బాలురు
  • బాలిక మృతదేహానికి బండరాయి కట్టి కృష్ణానదిలో పడేసిన నిందితుడి తండ్రి, పెదనాన్న
సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులను నివ్వెరపరుస్తున్నాయి. నిండా పదిహేనేళ్లు కూడా లేని ముగ్గురు బాలురు ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి చదువుతుండగా, మరో బాలుడు ఆరో తరగతి చదువుతుండడం గమనార్హం.

పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం
పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇలా చేయాలని మీకెలా తెలిసిందని ప్రశ్నిస్తే నివ్వెరపోయే విషయం చెప్పారు. ఇవన్నీ ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. శవాన్ని ఎలా మాయం చేశారన్న ప్రశ్నకు మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడంలో ఓ బాలుడి తండ్రి, పెదనాన్న పాత్ర ఉందని తెలిసి వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

మృతదేహానికి బండరాయి కట్టి..
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు విషయాన్ని ఎక్కడ బయటపెట్టేస్తుందోనని భయపడి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని తీసుకెళ్లి కేసీ కెనాల్ దగ్గర ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఒకడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలుడి తండ్రి, పెదనాన్ని కలిసి మృతదేహాన్ని బైక్‌పై వనుములపాడు మీదుగా కృష్ణా నది వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అలానే పడేస్తే తేలుతుందని భావించి బండరాయి కట్టి నీటిలో పడేశారు. కాగా, నిందితులు చెప్పిన ప్రాంతంలో గాలించినా మృతదేహం దొరక్కపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాలిక మృతదేహం లభించే వరకు గాలింపు కొనసాగుతుందని నద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు.

జువైనల్ హోంకు నిందితులు
ఈ కేసులో నిందితులైన బాలురను పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన కాటం యోహాన్, బొల్లెద్దుల సద్గురుడును రిమాండ్‌కు తరలించారు.
Go Back to Shorts
Muchumarri
Nandyal
Crime News
Andhra Pradesh

More Telugu News