కశ్మీర్లో ఎన్కౌంటర్లు.. అల్మారాలో దాక్కున్న టెర్రరిస్టుల హతం!
- కుల్గామ్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదుల హతం
- చిన్నిగమ్ ఫ్రిసాల్ ప్రాంతంలో కప్బోర్డు వెనకున్న రహస్య బంకర్లో దాక్కున్న ఉగ్రవాదుల హతం
- అమరులైన ఇద్దరు జవాన్లు
‘‘మోడెర్గామ్లో జరిగిన తొలి ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా ఓ సైనికుడు అమరుడయ్యాడు. కుల్గామ్లోని చిన్నిగామ్ ప్రాంతంలో జరిగిన రెండో ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో సైనికుడు కన్నుమూశాడు’’ అని పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ వీకే బిర్డీ పేర్కొన్నారు. ఉగ్రవాదులందరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వారేనని, మరణించిన వారిలో ఒకరు స్థానిక కమాండర్ అని కూడా పేర్కొన్నారు.
మోడెర్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నయన్ మృతి చెందగా చిన్నీగమ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 1 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన హవాల్దార్ రాజ్ కుమార్ అమరులయ్యారు.
కాగా, అమర్నాథ్ యాత్ర దృష్ట్యా తనిఖీలు మరింత కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లు హైవేకు దూరంగా జరిగాయన్నారు. ఉగ్రవాదుల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉంటున్నామని, ఫలితంగా ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి.