Pawan Kalyan: 9 నెలల కిందట అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం... స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన పవన్ కల్యాణ్

ఇటీవల ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటిపర్యంతమైంది. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ మాచవరం పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఆ మైనర్ బాలిక జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. 

ఈ విషయాన్ని నేడు కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు. పోలీసు ఉన్నతాధికారితో పవన్ మాట్లాడారు. అందుకు ఆ పోలీసు ఉన్నతాధికారి బదులిచ్చారు. 

"ఆ అమ్మాయి పేరు తేజస్విని సర్... 9 నెలల క్రితం మిస్సయింది... మీరు చెప్పిన వెంటనే ఇద్దరు సీఐలతో టీమ్ ఏర్పాటు చేశాం సర్... టెక్నికల్ టీమ్, సైబర్ టీమ్ కూడా ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి.. కేరళ, బెంగళూరు కూడా వెళ్లి వెతికాం సర్... చివరికి జమ్మూలో ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది సర్. ఆ అమ్మాయి సేఫ్ గా ఉంది... అయితే ఇది కిడ్నాప్ కేసు కాదు సర్... పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది... ఆ అమ్మాయిని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం... తదుపరి దర్యాప్తు వివరాలు త్వరలోనే తెలియజేస్తాం సర్" అని పోలీసు అధికారి పవన్ కు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pawan Kalyan
Police
Missing Girl
Jammu
Vijayawada
Janasena
Andhra Pradesh

More Telugu News