బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ భేటీ... హాజరుకాని నలుగురు
- ఎర్రవెల్లి ఫాంహౌస్లో సమావేశమైన కేసీఆర్
- భేటీకి 17 మంది జెడ్పీ చైర్మన్ల హాజరు
- భవిష్యత్తు మనదే... పార్టీ మారవద్దని సూచన
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందన్నారు. రానున్న రోజులు మనవేనని... ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్దేనని... పార్టీ మారవద్దని సూచించారు. ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని గుర్తు చేశారు.
జ్ఞాపికలను అందించిన కేటీఆర్
సమావేశం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... జెడ్పీ చైర్మన్లందరికీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందించారు. ఈ భేటీలో జెడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.