ఈ నెల 6న హైదరాబాద్‌లో కలుద్దాం!: రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ

  • ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామన్న ఏపీ సీఎం
  • విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు
  • రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్న ఏపీ సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని ప్రతిపాదన చేశారు.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని... ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదన్నారు. పరస్పర సహకారం... తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
 


More Telugu News

Chandrababu Revanth Reddy Telangana Andhra Pradesh