'కల్కి 2898 ఏడీ' చివరి అరగంట సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది: రాజమౌళి

  • నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన కల్కి 2898 ఏడీ
  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిత్రం
  • సెట్టింగ్ లు అద్భుతం అంటూ రాజమౌళి కితాబు
  • ప్రభాస్ తన టైమింగ్ తో చంపేశాడంటూ ప్రశంసలు
అగ్ర కథానాయకుడు ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కల్కి... విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో మూడు విభిన్న ప్రపంచాలను సృష్టించిన తీరును సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. తాజాగా, అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కి 2898 ఏడీ చిత్రంపై తన స్పందన తెలియజేశారు. 

"కల్కి 2898 ఏడీ చిత్రం ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సెట్టింగ్ లు నన్ను వేర్వేరు కాలాలకు తీసుకెళ్లాయి. డార్లింగ్ (ప్రభాస్) తన టైమింగ్ తో, నటనా ప్రతిభతో చంపేశాడంతే! అమితాబ్ గారు, కమల్ సర్, దీపిక గొప్పగా నటించారు. ఈ సినిమాలో చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంతటి భారీ పనితనాన్ని కనబరిచే క్రమంలో అసమాన కృషి చేసిన దర్శకుడు నాగి (నాగ్ అశ్విన్), వైజయంతీ మూవీస్ బృందానికి శుభాభినందనలు" అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Kalki 2898 AD
Rajamouli
Prabhas
Nag Ashwin
Vyjayanthi Movies

More Telugu News