అమెరికాలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి
- మరో మహిళకు బుల్లెట్ గాయాలు.. పరిస్థితి విషమం
- కాల్పులు జరిపింది కూడా భారత సంతతి పౌరుడే
- అరెస్టు చేసి విచారిస్తున్న న్యూజెర్సీ పోలీసులు
న్యూజెర్సీ రాష్ట్రంలోని మిడిల్ సెక్స్ కౌంటీలో బుధవారం ఉదయం ఇద్దరు మహిళలపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. రోడ్డు పక్కగా నడుస్తున్న వారిపై చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ జస్వీర్ కౌర్ (29) స్పాట్ లోనే చనిపోగా, ఆమె సోదరి (20) కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే బాధితులను ఇద్దరినీ ఎయిర్ ఆంబులెన్స్ సాయంతో నెవార్క్ లోని ఓ ఆసుపత్రికి చేర్చారు.
అప్పటికే జస్వీర్ కౌర్ చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, కాల్పులు జరిపిన యువకుడిని గౌరవ్ గిల్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నానికి గౌరవ్ ను అతడి ఇంటి వద్దే అరెస్టు చేశారు. జస్వీర్ కౌర్, ఆమె సోదరి ఇద్దరూ తనకు తెలుసని నిందితుడు చెప్పాడు. పంజాబ్ లో జస్వీర్ సోదరి, తాను కలిసి చదువుకున్నట్లు వెల్లడించాడు. అయితే, కాల్పులు జరపడానికి కారణమేంటనే విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు.