Whatsapp: ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్

Whatsapp Hacking Through viral link
షార్ట్స్‌లో చూడండి
వాట్సాప్ లో వచ్చే లింక్ లను తెలిసీతెలియకుండా క్లిక్ చేస్తే ముప్పు తప్పదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. జిల్లాలోని సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో దాదాపు పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, వారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు సందేశాలు పంపిస్తున్నారని చెప్పారు. ఇటీవల గ్రామస్థుల వాట్సాప్ గ్రూప్ లోకి పీఎం కిసాన్ యాప్ లింక్ ను కొంతమంది ఫార్వార్డ్ చేశారు. ఈ నెల 18న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజా లింక్ వాట్సాప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతోంది. పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు.. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ విషయమై సైబర్‌ క్రైం డీఎస్పీ హసీద్‌ ఉల్లాను మీడియా సంప్రదించగా.. మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పీఎం కిసాన్‌ యాప్‌ పేరుతో ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Go Back to Shorts
Whatsapp
Hacking
Viral Link
Cybercrime
Fraud
PM Kisan App

More Telugu News