జమ్మూకశ్మీర్లో ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి
- బుధవారం దోడా జిల్లాలో ఘటన
- ఆర్మీ తాత్కాలిక స్థావరాన్ని టార్గెట్ చేసిన ఉగ్రమూకలు
- దాడిలో ఐదుగురు సైనికులు, ఒక పోలీసు అధికారికి గాయాలు
- భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి
- దాడికి తామే కారణమని ప్రకటించుకున్న కశ్మీర్ టైగర్స్
కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు. ఈ దాడి కూడా అందులో భాగమేనని అన్నారు. ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టామని చెప్పారు. మిగతావారి కోసం గాలిస్తున్నామని అన్నారు.
కథువా జిల్లాలో ఇటీవలే ఓ ఇంటిపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎదురుకాల్పులకు దిగిన భద్రతాదళాలు ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హీరానగర్ సెక్టర్లో ఈ ఘటన వెలుగు చూసినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
అంతకుమునుపు జూన్ 9న రైసీ జిల్లాలో కొందరు ఉగ్రవాదులు, యాత్రికులతో వెళుతున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బస్సు సమీపంలోని లోయలో పడిపోయింది. ఆ తరువాత కూడా ఉగ్రవాదులు తమపై కాల్పులు కొనసాగించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారు. మే 4 పూంచ్ సెక్టర్ లో ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై దాడి చేసిన ఉగ్రమూకలే బస్సును టార్గెట్ చేసుకుని ఉంటాయని ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి.