చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆకాశానికెత్తేసిన ‘ఇండియాటుడే’.. షేర్ చేస్తూ మురిసిపోతున్న అభిమానులు.. వీడియో ఇదిగో!

India Today Praises TDP Chief Chandrababu Naidu
  • 1990లలో చంద్రబాబు పాలన కార్పొరేట్ శైలిలో ఉండేదని ప్రశంస
  • ఆయనను అందరూ ఆంధ్రప్రదేశ్ సీఈవోగా పిలిచేవారని ప్రశంస
  • ప్రపంచం దృష్టిని హైదరాబాద్‌ వైపు మళ్లించిన గొప్ప వ్యక్తి అని కొనియాడిన కథనం
  • జగన్ అధికారంలో రావడంతో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారన్న ‘ఇండియాటుడే’
  • ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయం సాధించి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆయనపై వరుసగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. అంతర్జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా చంద్రబాబు పేరు వినిపిస్తోంది. 

తాజాగా, ఆయనపై ‘ఇండియాటుడే’ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ పొంగిపోతున్నాయి. చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక సీఎంగా కాకుండా ‘సీఈవో’గా పేరు పొందారని ఆ కథనం కొనియాడింది. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన చంద్రబాబు పాలన 1990లలో ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా కార్పొరేట్ శైలిలో ఉండేదని పేర్కొంది. 

నిజాం నగరం హైదరాబాద్‌ను నవభారతంలో సైబర్ హబ్‌గా మార్చేశారని వివరించింది. హైటెక్ సిటీ, ఐటీ, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వంటివాటితో సైబరాబాద్‌గా మార్చేశారని ప్రశంసించింది. హైటెక్ సిటీ హైటెక్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మారిందని పేర్కొంది. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ రప్పించి దేశం మొత్తం ఇటు చూసేలా చేశారని గుర్తు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని, ప్రఖ్యాత టైం మ్యాగజైన్ నుంచి ‘సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు అందుకున్నారని వివరించింది. నేడు భారతదేశంలో హైటెక్ సిటీ ఐటీ, బయో, హెల్త్, ఇంజినీరింగ్ హబ్‌గా మారిందని పేర్కొంది.

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడింది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయన చేపట్టినవి అన్నీ ఆగిపోయాయని పేర్కొంది. ఇప్పుడు ఆయన మరోమారు అధికారంలోకి రావడంతో తాను పూర్తిచేయాల్సిన పనులపై చంద్రబాబు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొంది.
Go Back to Shorts
Chandrababu
CEO
Cyberabad
Hightech City
India Today

More Telugu News