భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాం: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ ఉల్లంఘన పాక్ పొరపాటన్న నవాజ్ షరీఫ్
- అప్పటి కార్గిల్ యుద్ధానికి పర్వేజ్ ముషారఫ్ కారణమని పరోక్ష ఆరోపణ
- 1998 మే 28న పాక్ అణుపరీక్షల నిర్వహణ
- అనంతరం, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం
‘‘1998 మే 28న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలను నిర్వహించింది. ఆ తరువాత వాజ్పేయి గారు ఇక్కడికొచ్చి మనతో ఒప్పందం (లాహోర్ డిక్లరేషన్ ) కుదుర్చుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య 1999లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని లాహోర్ డిక్లరేషన్ అని అంటారు. ఇందులో భాగంగా ఇరు దేశాలు.. శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఆ తరువాత కొన్ని నెలలకే పాక్ ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరతీసింది. ఫలితంగా జరిగిన యుద్ధంలో పాక్ ఓటమి చవి చూసింది.
అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ కు 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఇస్తానని ఆశ చూపినట్టు నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ ఆ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తన స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉండే బిల్ క్లింటన్ ప్రతిపాదనకు అంగీకరించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ పన్నిన కుట్రలో భాగంగానే అప్పట్లో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ కు పీఎం పదవి కట్టబెట్టేందుకు ఐఎస్ఐ ఈ కుట్రకు తెరలేపిందన్నారు.