Election Commission: పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యం: కేంద్ర ఎన్నికల సంఘం

Nobody can change data of votes polled says EC
  • మొదటి ఐదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను విడుదల చేసిన ఈసీ
  • నియోజకవర్గాలవారీగా మొత్తం పోలైన ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలు వెబ్ సైట్‌లో వెల్లడి
  • ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా క్రమపద్ధతిలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. మొదటి ఐదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నియోజకవర్గాలవారీగా మొత్తం పోలైన ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను తన వెబ్ సైట్‌లో వెల్లడించింది. పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా ఒక క్రమపద్ధతిలో కొందరు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఓటింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతీ పోలింగ్ కేంద్రం వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్ సైట్‌లో ఉంచాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పటికే ఐదు దశలు ముగిసి... రెండు దశలు మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈసీకి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈసీ గణాంకాలను వెబ్ సైట్లో ఉంచింది.

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నవారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు ఓటర్ టర్నౌట్ డేటా ఫార్మాట్‌ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య, నమోదైన పోలింగ్ శాతం ఆధారంగా ఎంతమంది ఓటు వేశారో తెలుసుకోవచ్చునని తెలిపింది. ఈ రెండు వివరాలు ఇప్పటికే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News