కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR tweets on Ten Years for Telangana foundation
  • జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు
  • వేల బలిదానాలు, ఉద్యమ సేనాని దీక్షతో తెలంగాణ సాకారమైందని వెల్లడి
  • అవహేళనలు ఎదుర్కొన్న గడ్డపై ఆత్మగౌరవ పతాకం ఎగురవేశామంటూ ట్వీట్
తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. "కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది" అంటూ ట్వీట్ చేశారు. ఆరున్నర దశాబ్దాల పోరాటం, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు, ఉద్యమ సేనాని అకుంఠిత దీక్షతో ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారమైందని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. 

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం మునుపెన్నడూ చూడని అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయిందని తెలిపారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల వరకు రికార్డులు బద్దలయ్యాయని కేటీఆర్ వివరించారు. గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకుని గంగా జమునా తెహజీబ్ కు సాక్షీభూతంగా నిలిచామని తెలిపారు. 

అవమానాలు ఎదుర్కొన్న గడ్డపైనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేశామని... కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది... వెయ్యేళ్లయినా చెక్కుచెదరని పునాది... జై తెలంగాణ అంటూ కేటీఆర్ భావోద్వేగాలతో స్పందించారు. జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశారు.
Go Back to Shorts
Telangana Foundation Day
KTR
KCR
BRS
Telangana

More Telugu News