కుక్క కరిచిందని యువకుడిపై దాడి.. హైదరాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో!
- అడ్డొచ్చిన ఆడవాళ్లపైనా విచక్షణారహితంగా దాడి
- పెంపుడు కుక్క కరవడంతో మధురానగర్ లో రెండు కుటుంబాల మధ్య గొడవ
- పోలీసులకు ఫిర్యాదు.. వారం తర్వాత కర్రలతో దాడి చేసిన బాధిత ఫ్యామిలీ
పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్ లో మధు, ధనుంజయ్ కుటుంబాల మధ్య ఈ గొడవ జరిగింది. మధు కుటుంబం పెంపుడు కుక్క కిందటి బుధవారం ధనుంజయ్ కుటుంబ సభ్యుడిని కరిచింది. దీంతో మధు కుటుంబంతో గొడవపడ్డ ధనుంజయ్.. సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారం రోజుల తర్వాత మంగళవారం రాత్రి మధు సోదరుడు శ్రీనాథ్ తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లాడు. రోడ్డు మీద కుక్కతో కనిపించిన శ్రీనాథ్ ను చూసి ధనుంజయ్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. కుక్కపైనా దాడి చేశారు. గొడవ గమనించి శ్రీనాథ్ సోదరి, తల్లి పరుగెత్తికెళ్లి అడ్డుకున్నారు. అయినా సరే ధనుంజయ్ కుటుంబానికి చెందిన యువకులు కర్రలతో కొట్టడం ఆపలేదు. దీంతో ఆ మహిళలు ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ యువకులు వెళ్లిపోయారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనాథ్ ను, ఆయన సోదరి, తల్లిని ఆసుపత్రికి, కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు ధనుంజయ్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.