Priyanka Gandhi: తెలంగాణకు నరేంద్ర మోదీ ఏమిచ్చారు?: తాండూరు సభలో ప్రియాంకగాంధీ నిలదీత

Priyanka Gandhi takes on PM Modi in Tandur meeting
  • తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ప్రియాంక గాంధీ
  • వేదిక మీది నుంచి దేశానికి ఇది చేశానని ప్రధాని మోదీ చెప్పలేరని విమర్శ
  • కానీ అవసరమైతే కన్నీళ్లు పెట్టుకుంటారని ఎద్దేవా
  • అధికారంలోకి వస్తే వ్యవసాయ ఆధార పంటలపై జీఎస్టీని తొలగిస్తామని హామీ

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఏమిచ్చారో చెప్పాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నిలదీశారు. శనివారం ఆమె వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వాస్తవాలు తెలియకుండా మోదీ మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఈ నేలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... ఇందిరాగాంధీని ఆదరించిన నేల... సోనియాగాంధీని సోనియమ్మ అని పిలిచి తల్లి స్థానం ఇచ్చిన నేల తెలంగాణ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు.

ఈ దేశంలో అత్యున్నత పదవి ప్రధానమంత్రి పదవేనని... కానీ వేదిక మీద నిలబడి తాను ఈ పని చేశానని మోదీ చెప్పింది లేదన్నారు. పైగా తాను సాధిస్తున్నానని చెబుతారు తప్ప దేశం కోసం ఏం చేశారో చెప్పరని విమర్శించారు. అవసరమైతే కన్నీళ్లు పెట్టుకుంటారు.. కానీ దేశం కోసం ఏం చేయలేదని అందరూ గమనించాలని కోరారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన పథకాలకు తన ఫొటో పెట్టుకొని తన ఫథకంగా చెప్పుకున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగినా ఇవ్వలేదని విమర్శించారు. ఐఐఎం, నవోదయ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. కానీ ధర్మం పేరుతో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం...

తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ ఆధార పంటలపై జీఎస్టీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయడం కోసం అద్భుత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ కింద రూ.400 ఇవ్వాలని చట్టం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో మహిళకు ఏడాదికి రూ.1 లక్ష ఇస్తామన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

రైతులు నష్టపోతున్నా కేంద్రం వారికి ఎలాంటి సహకారాన్ని అందించడం లేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్యుడి నడ్డి విరిగిందని... చిన్న వ్యాపారుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. దేశంలో 70 కోట్లమంది నిరుద్యోగులు కనిపిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు, రైతులకు ఏమీ చేయని బీజేపీ ధనవంతులకు మాత్రం రూ.16 లక్షల కోట్లను మాఫీ చేసిందని ఆరోపించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ధనవంతుల విషయంలో మాత్రమే జరిగిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అతి కొద్దిమంది కోసం మాత్రమే పని చేస్తోందని విమర్శించారు.

మహిళలు, నిరుద్యోగులు, పేదల కోసం బీజేపీ పని చేయదని ఆరోపించారు. సామాన్య ప్రజలపై భారీగా పన్నులు విధిస్తున్న మోదీ ప్రభుత్వం ధనవంతులకు మాత్రం వెసులుబాటు ఇస్తోందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఆ ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.500కే సిలిండర్ ఇస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు. మన హైందవ ధర్మంలో రుషులు, మునులు మనకు నేర్పించింది సత్యబద్ధంగా నడవడం అన్నారు.

  • Loading...

More Telugu News