నేను బస్సెక్కగానే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుట్టి ఆ నిధులు వేస్తున్నాడు: కేసీఆర్
- తాను రథం ఎక్కగానే ప్రభుత్వానికి దెయ్యం వదిలిందని వ్యాఖ్య
- తన దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు వేస్తున్నారన్న కేసీఆర్
- ఆరెకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారని ప్రశ్న
ఇన్నాళ్లు బంద్ పెట్టిన రైతుబంధును మళ్లీ ఇవ్వాళ మొదలు పెట్టాడని... ఇన్నాళ్లు బంద్ పెట్టి ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్తున్నారని ప్రశ్నించారు. పోరాడితే తప్ప ఏదీ జరగదని... అందుకే అందరికీ ఒక్కటే చెబుతున్నానని... తెలంగాణ శక్తి బీఆర్ఎస్... తెలంగాణ బలం బీఆర్ఎస్... తెలంగాణ గళం బీఆర్ఎస్... తెలంగాణ దళం బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తెనే దెయ్యం వదిలి, ముఖ్యమంత్రికి వణుకు పుట్టి రైతుబంధు వేస్తున్నారన్నారు.
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు వేయనని చెబుతున్నారని... ఆరెకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలను అన్నింటిని అమలు చేయించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలన్నారు. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందన్నారు.
నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. మోదీ చెప్పినట్లు రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, పైగా సాగు ఖర్చులు రెండింతలయ్యాయని మండిపడ్డారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారని... మోదీ ఇచ్చిన నినాదాల్లో ఒక్కటైనా నిజమైందా? అని నిలదీశారు. మోదీ అచ్చేదిన్ అంటే రైతులకు చచ్చేదిన్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.