రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు పాకిస్థాన్ తహతహలాడుతోంది: పాక్ మాజీ మంత్రి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ
- ప్రచార వీడియోను షేర్ చేస్తూ 'రాహుల్ గాంధీ ఆన్ ఫైర్' అని ట్వీట్ చేసిన పాక్ మాజీ మంత్రి
- ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ
- కాంగ్రెస్ యువరాజు కోసం పాక్ నేతలు ప్రార్థిస్తున్నారని ఎద్దేవా
దేశంలో కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతోందని, ఇక్కడ కాంగ్రెస్ దిగజారిపోతుంటే పాకిస్థాన్ కన్నీళ్లు పెట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పాక్ అభిమాని అని... దీంతో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఉవ్విళ్లూరుతోందని చురక అంటించారు. భారత్ బలహీనంగా ఉండాలని మన శత్రువులు కోరుకుంటారని పేర్కొన్నారు. 2014కు ముందు ఉన్న ప్రభుత్వం మరోసారి రావాలని దాయాది దేశం కోరుకుంటోందన్నారు.
రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'రాహుల్ ఆన్ ఫైర్' అని ట్వీట్ చేశారు. ఫవాద్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్లో పని చేశారు.