Revanth Reddy: నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీ మామకు తెలుసు... సిద్ధమా?: హరీశ్ రావు కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్

  • పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? అని ప్రతి సవాల్
  • రైతుల రుణాలు మేం తీరుస్తాం... వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచన
  • బొట్టు పెట్టి ఓటు అడగాలని కాంగ్రెస్ కేడర్‌కు పిలుపు
  • పాలమూరు విషయంలో పరాయివాడు పరాయివాడేనని కేసీఆర్ నిరూపించాడని విమర్శ
  • కేసీఆర్ తాగుబోతు సంసారం... అప్పుల సంసారంగా చేస్తే రూ.26వేల కోట్ల కిస్తీలు కట్టానన్న ముఖ్యమంత్రి
Revanth Reddy accepts Harish Rao challenge

బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అగస్ట్ 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని (బీఆర్ఎస్) రద్దు చేసుకుంటావా? నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామకు (కేసీఆర్)కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'హరీశ్ రావు నాకు సవాల్ విసిరారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్‌ను స్వీకరించు. భూమితలకిందులైనా... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉరేసుకొని సచ్చినా నేను రుణమాఫీ చేస్తా.. నా సవాల్‌ను స్వీకరిస్తావా?' అని ప్రతి సవాల్ విసిరారు.

బ్యాంకు అధికారులకు సూచన

తాము కచ్చితంగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొంతమంది బ్యాంకు అధికారులు రైతులను అప్పులు కట్టాలని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందని... అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల తరఫున మాది జిమ్మేదార్... మీ బ్యాంకుల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందన్నారు.

కేసీఆర్‌పై విమర్శలు

అధికారంలో ఉన్నప్పుడు వరి వేసుకోమని చెప్పి... ఆ తర్వాత వరి వేసుకుంటే ఉరి అన్న కేసీఆర్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటేద్దామా? అని ప్రశ్నించారు. అలాంటి వారిని నమ్మి ఓటు వేయవద్దని కోరారు. తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కేంద్రాన్ని నిలదీసి నాడు వరి కొనుగోలు చేసేలా చేశామన్నారు.

బొట్టు పెట్టి ఓటు అడగండి

ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారని... తాను కొడంగల్ కుటుంబ సభ్యుడిని... మీరే నా బలగం కాబట్టి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50వేల మెజార్టీ ఇస్తేనే ఢిల్లీలో నేను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాబోయే ఇరవై రోజులు చాలా కీలకమన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు. అమ్మలక్కలు ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి మరీ మనకు ఓటు వేయాలని వారిని కోరాలని చెప్పారు. బొట్టు పెట్టి ఓటు అడగండి... పోలింగ్ బూత్‌కు రమ్మనండి అని సూచించారు. అందరి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు.

పరాయివాడు పరాయివాడేనని కేసీఆర్ నిరూపించాడు

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్, సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నాడని.. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. తద్వారా పరాయివాడు పరాయివాడేనని నిరూపించాడన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలమూరు జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపించాడన్నారు. మనం వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు పాలమూరు జిల్లా అభివృద్ధి మన చేతుల్లో ఉందన్నారు.

రూ.26వేల కోట్ల కిస్తీలు కట్టాను

తాను అధికారం చేపట్టే నాటికి ఖజానా దివాలా తీసిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రూ.300 కోట్ల లోటు బడ్జెట్‌తో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కేసీఆర్ తాగుబోతు సంసారం... అప్పుల సంసారంగా చేస్తే ఆయన చేసిన అప్పులకు ఈ నాలుగు నెలల్లో తాను రూ.26వేల కోట్ల కిస్తీ కట్టానని వాపోయారు. అయినా ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇస్తున్నామని, పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామని తెలిపారు.

More Telugu News