మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్

  • విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం
  • సోషల్ మీడియా కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానన్న జగన్ 
  • పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపు 
ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా విభాగంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు మీ జగనన్న ఎప్పుడూ అండగా ఉంటాడు అని స్పష్టం చేశారు. 

అనంతరం, తన నుదుటిపై గాయాన్ని చూపిస్తూ, ఈ దెబ్బ ఇక్కడి తగిలింది అంటే... ఇక్కడా (కంటికి) తగల్లేదు, ఇక్కడా (కణతకు) తగల్లేదు అంటే ఆ దేవుడు మనతో ఇంకా పెద్ద స్క్రిప్టునే రాయించే పనిలో ఉన్నాడు అని అర్థం అని వివరించారు. కాబట్టి, భయపడాల్సిన పనిలేదని, ఏపీలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాల్లో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకే వీల్లేదని అన్నారు. 

మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం అని, పార్టీ విజయం కోసం కృషి చేయాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

మనం ఇవాళ చంద్రబాబు, దత్తపుత్రుడి కుట్రలపై యుద్ధం చేస్తున్నాం... వందమంది చంద్రబాబులు వచ్చినా, వందమంది దత్తపుత్రులు వచ్చినా, వంద ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు వచ్చినా, జాతీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి మద్దతు పలికినా ఈ జగన్ భయపడడు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పైన ఆ దేవుడు, కింద మీరంతా ఈ జగనన్నకు అండగా ఉన్నారు అని పేర్కొన్నారు.

YS Jagan
YSRCP
Soical Media Wing
Memantha Siddham
Visakhapatnam

More Telugu News