UGC: నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీ‌.. ఆశావహులకు యూజీసీ గుడ్‌న్యూస్

UGC to allows four year bachelors degree students to Pursue NET Directly

  • నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ‌ అర్హతతో నెట్‌ పరీక్ష రాసేందుకు అవకాశం
  • జేఆర్ఎఫ్ సాధించలేకపోయినా 75 శాతం మార్కులుంటే పీహెచ్‌డీ చేసేందుకు అనుమతి
  • కొత్త నిబంధనలను వెల్లడించిన యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్

పీహెచ్‌డీ ఆశావహులకు యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్) గుడ్‌న్యూస్ చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ అర్హత పరీక్ష నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ప్రయత్నించవచ్చునని తెలిపింది. నూతన నిబంధనల మేరకు ఈ అనుమతి ఇస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించలేకపోయినా అభ్యర్థులు సైతం పీహెచ్‌డీ చేయడానికి అర్హులుగా పరిగణించబడతారని, అయితే అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో కనీసం 75 శాతం లేదా దానికి సమానమైన గ్రేడ్ స్కోర్ చేయాల్సి ఉంటుందని జగదీశ్ కుమార్ వివరించారు.

కాబట్టి నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులు పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఇకపై నేరుగా నెట్ పరీక్షకు హాజరుకావొచ్చని, సంబంధిత సబ్జెక్టుల్లో అనుమతి ఉంటుందని వివరించారు. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం... కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పొందిన వారు నెట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హతగా ఉంది. కాగా ఈ ఏడాది నెట్ ఎగ్జామ్ జూన్ 16న జరగనుంది. ఈ ఏడాది కంప్యూటర్ ఆధారిత పరీక్షకు బదులుగా ఆఫ్‌లైన్ విధానాన్ని నిర్వహించేందుకు యూజీసీ నిర్ణయించింది. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గత శనివారమే మొదలవ్వగా.. మే 10న ముగియనుంది.

  • Loading...

More Telugu News