Raghu Rama Krishna Raju: చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ బీ ఫారం అందుకున్న రఘురామకృష్ణరాజు

  • ఈసారి ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ
  • నేడు చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన టీడీపీ అభ్యర్థులు
  • అందరికీ బీ ఫారాలు అందజేసిన టీడీపీ అధినేత 
  • ఉండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడతానన్న రఘురామ
Raghu Rama Krishna Raju has taken B Form from Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఏపీలో 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏపీలో నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా.... బీ ఫారాల కోసం అభ్యర్థులంతా ఇవాళ చంద్రబాబు నివాసానికి రావడంతో అక్కడంతా పసుపు కోలాహలం నెలకొంది. 

కాగా, చివరి వరకు ఉత్కంఠత ఎదుర్కొని, ఎట్టకేలకు ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రఘురామకృష్ణరాజు కూడా నేడు బీ ఫారం అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా  ఉండి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నాను. నన్ను ఎల్లప్పుడూ ఆదరించి, ఆశీర్వదిస్తున్న ఉండి ప్రజల వెన్నంటి నిలిచి, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఈ సందర్భంగా ఉండి ప్రజానీకానికి మాటిస్తున్నాను" అంటూ రఘురామ ట్వీట్ చేశారు. 

రేపు (ఏప్రిల్ 22) సోమవారం ఉదయం 10 గంటలకు పెద అమిరంలోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఉండి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ వేస్తానని రఘురామ మరో ట్వీట్ లో వెల్లడించారు.

More Telugu News