కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోంది... నెమ్మదిగా జైల్లోనే మరణించేలా చేస్తున్నారు: ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్

తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని... నెమ్మదిగా జైల్లోనే మరణించేలా చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్ర విమర్శలు చేశారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని విమర్శించారు. దీంతో ఆయన అవయవాలపై ప్రభావం పడి అనారోగ్య సమస్యలతో నెమ్మదిగా మరణించేలా కుట్ర చేస్తున్నారన్నారు. కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

ఈ నేపథ్యంలో సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ... కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోవడం వల్ల గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దీనివల్ల రెండు, మూడు నెలల అనంతరం ఆయనను విడుదల చేసినా ఏ ప్రయోజనం ఉండదని... ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.


More Telugu News