Duvvada Srinivas: తన భార్య తనపై పోటీ చేస్తుండటంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ స్పందన

  • టెక్కలి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్
  • ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్న ఆయన భార్య వాణి
  • అంతా కలికాలం ప్రభావం అన్న దువ్వాడ
Duvvada Srinivas comments on her wife contesting as independent

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. టెక్కలి స్థానం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మరోవైపు, టెక్కలి నుంచి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ఆయన భార్య, జడ్పీటీసీ సభ్యురాలు వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తన భార్య తనపై పోటీ చేయబోతోందనే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే హక్కు ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వారిని ఆపే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. సొంత అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు కూడా తిరగబడొచ్చని, అంతా కలియుగం ప్రభావం అని అన్నారు. తన భార్య నామినేషన్ వేయదనే అనుకుంటున్నానని చెప్పారు. తనది పాతికేళ్ల రాజకీయ జీవితం అని... రాత్రికి రాత్రి తయారైన రెడీమేడ్ నాయకుడిని తాను కాదని అన్నారు. టెక్కలిలో 25 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని చెప్పారు. 

టెక్కలి నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాక, పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ దని కొనియాడారు. మరోవైపు, వ్యక్తిగత విభేదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, వాణి దూరంగా ఉంటున్నారు.

More Telugu News