KCR: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ వినతి

  • సీఈవోకు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి
  • ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడి
  • బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
BRS letter to CEO for kcr bus yatra

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కె.వాసుదేవరెడ్డి... సీఈవోకు వినతిపత్రం అందించారు.

ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని తమ పార్టీ అధినేత నిర్ణయించారని తెలిపారు. బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించాలని... అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.

బీఆర్ఎస్‌ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తోందని అన్నారు. ఇటీవల చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన బహిరంగసభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని పేర్కొన్నారు.

More Telugu News