కోర్టు నిర్ధారణ చేయకముందే కవిత తప్పు చేశారని ఎలా అంటారు? మమ్మల్నీ జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: హరీశ్ రావు
- మద్యం కేసులో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బీజేపీ నేత నరేంద్ర మోదీ ఆశీర్వాదం తీసుకున్నారని వ్యాఖ్య
- తాను కాదు... రేవంత్ రెడ్డే ఏక్ నాథ్ షిండే అవుతాడన్న హరీశ్ రావు
బీజేపీ నేత నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కోరారని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు... బీజేపీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఎవరి వైపు ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సుపారీలు తీసుకొని బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బెదిరించి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్పించుకుంటున్నారన్నారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఐటీ దాడులు, సీబీఐ దాడులు ఉండవని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బండకేసి కొడతారన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. ఏక్ నాథ్ షిండే అయ్యేది తాను కాదని... రేవంత్ రెడ్డే అవుతారని జోస్యం చెప్పారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటానని తెలిపారు. పదవి కోసం గడ్డి తినే అలవాటు తనకు లేదని వెయ్యిసార్లు చెప్పానని గుర్తు చేశారు.