Paris Olympics-2024: పారిస్ ఒలింపిక్స్-2024 కోసం గ్రీస్ లో జ్యోతి ప్రజ్వలనం

  • జులై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒలింపిక్ క్రీడలు
  • ఒలింపియా గ్రామంలో గ్రీకు సంప్రదాయాల ప్రకారం జ్యోతి ప్రజ్వలనం
  • జ్యోతిని వెలిగించిన మహిళా మతగురువులు
  • వివిధ దేశాల గుండా ప్రయాణించి పారిస్ చేరుకోనున్న ఒలింపిక్ జ్యోతి 
Olympic torch for Paris2024 lit in Olympia

పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు. ఇక్కడి పురాతన స్టేడియంలో గ్రీకు సంప్రదాయం ప్రకారం ఒలిపింక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. 

"సూర్య భగవానుడా (అపోలో గాడ్)... పారిస్ ఒలింపిక్స్ జ్యోతిని మండించేందుకు మీ కిరణాలను పంపండి... ఇక, సర్వశక్తిమంతుడైన జ్యూస్... భూమిపై ఉన్న ప్రజలందరికీ శాంతిని, పవిత్ర క్రీడల విజేతలకు ఆశీస్సులు అందజేయండి" అంటూ ఈ సందర్భంగా మహిళా మతగురువులు ప్రార్థించారు. 

క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియా గ్రామంలో పుట్టిన పురాతన క్రీడా పోటీలే కాలక్రమంలో ఒలింపిక్స్ గా విశ్వవ్యాప్తం అయ్యాయి. ఇక్కడి వెలిగించిన ఒలింపిక్ జ్యోతి అనేక దేశాల గుండా ప్రయాణం చేసి ఈ ఏడాది విశ్వ క్రీడా సంరంభానికి ఆతిథ్యమిస్తున్న పారిస్ నగరానికి చేరుకుంటుంది. కాగా, తొలిగా ఈ జ్యోతిని అందుకునే అవకాశం గ్రీస్ గోల్డ్ మెడల్ రోయర్ స్టెఫానోస్ ఎన్ టోస్కాస్ కు లభించింది. 

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ భారీ క్రీడోత్సవాల్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.

More Telugu News