ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

Dasoju Sravan open letter to CM Revanth Reddy
  • అంబేడ్కర్‌ను అవమానించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • కేసీఆర్‌పై ఉన్న కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచారని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు సీఎం పదవినే కించపరిచినట్లుగా ఉందన్న శ్రవణ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించినందుకు గాను యావత్ తెలంగాణకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద స్మారక చిహ్నమైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవమానించిందని విమర్శించారు. కేసీఆర్‌పై ఉన్న కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై రేవంత్ రెడ్డికి దురభిమానం ఉందని, ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిర్లక్ష్యం చేస్తూ, అగౌరవపరిచి సీఎం రేవంత్‌రెడ్డి తన అగ్రవర్ణ దురహంకారాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని చూపించారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్‌ నిర్మించారనే రేవంత్ రెడ్డి రాజ్యాంగ బాధ్యతను విస్మరించారు అనుకోవాలా? లేక రాజకీయ ప్రతీకార ద్వేషంతో ఈ చర్యకు పాల్పడ్డారని అనుకోవాలా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ముఖ్యమంత్రి పదవినే కించపరిచినట్లు ఉన్నాయని ఆరోపించారు. సామాజిక సున్నిత పాలనకు నైతిక దిక్సూచిగా నిలిచే అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేసీఆర్ ఆవిష్కరించ‌డ‌మే కాకుండా రాష్ట్ర సచివాలయానికే ఆ మహనీయుడి పేరు పెట్టి దార్శనికుడిగా నిలిచారని కితాబునిచ్చారు.
Go Back to Shorts
Dasoju Sravan
BRS
BJP
Revanth Reddy
Congress

More Telugu News