సీఎం జగన్‌పై రాయిదాడి ఘటన.. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.. దాడి జరిగింది అక్కడి నుంచే?

Clues team started investigation on the incident of stone pelt attack on CM Jagan
  • వివేకానంద స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దాడి జరిగి ఉండొచ్చని అనుమానాలు
  • సీసీ ఫుటేజీలను పరిశీస్తున్న పోలీసులు
  • పలువురు అనుమానితులను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్‌ నగర్‌లోని వివేకానంద స్కూల్‌ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పైనుంచి దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీఫుటేజ్‌లను చెక్ చేస్తున్నారు.

కాగా వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుడివైపు ఇళ్లు ఉండడంతో ఎడమవైపు ఉన్న స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో వేలిముద్రలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది.

కాగా వైద్యుల సూచన మేరకు సీఎం జగన్ శనివారం రాత్రి హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Go Back to Shorts
YS Jagan
stone Attack
Andhra Pradesh
AP Police

More Telugu News