పాక్‌లో చారిత్రాత్మక హిందూ దేవాలయం కూల్చివేత

  • ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఆలయం
  • దేశ విభజన సమయంలో హిందువులు భారత్‌కు తరలిరావడంతో పాడుపడ్డ ఆలయం
  • కమర్షియల్ భవన నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చేసిన అధికారులు
  • భూరికార్డుల్లో ఆలయ ప్రస్తావనే లేదంటూ వితండవాదం
పాక్‌లో ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆప్ఘన్ సరిహద్దుకు సమీపంలోని లండీ కోతాల్ బజార్‌లో ఉన్న ఈ దేవాలయాన్ని కమర్షియల్ భవనం నిర్మాణం కోసం కూల్చివేసినట్టు తెలుస్తోంది. 

1947 దేశవిభజన సమయంలో స్థానిక హిందువులు పాక్‌ను వీడిన తరువాత ఈ దేవాలయం మూత పడింది. దాని బాగుగోలు చూసేవారు లేకపోవడంతో క్రమంగా ఆలయంలోని ఒక్కో భాగం కనుమరుగవడం ప్రారంభించింది. తాజాగా ఆలయాన్నే తొలగించేందుకు అధికారులు అంగీకరించడంతో అది కనుమరుగైపోయింది. 15 రోజుల క్రితం అక్కడ కమర్షియల్ భవన నిర్మాణం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 

కాగా, గుడి కూల్చివేత అక్రమమంటూ స్థానిక గిరిజన జర్నలిస్టు ఇబ్రహీం షిన్వారీ గొంతెత్తారు. గుడి విషయం అధికారిక రికార్డుల్లో లేదని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖైబర్ దేవాలయంగా పేరు పడ్డ ఆ గుడి గురించి తాతముత్తాతల ద్వారా తనకు తెలిసిందన్నారు. 1992లో భారత్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా స్థానిక మతపెద్దలు ఈ దేవాలయాన్ని పాక్షికంగా కూలగొట్టారని చెప్పుకొచ్చారు. అక్కడ ఎప్పటి నుంచో గుడి ఉందన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని అన్నారు. స్థానికంగా ఏయే నిర్మాణాలు ఉన్నాయో పక్కాగా లెక్కలు రికార్డు చేయడం రెవెన్యూ యంత్రాంగం బాధ్యత అని చెప్పారు. రికార్డుల్లో గుడి ప్రస్తావన లేదంటూ బాధ్యతల నుంచి అధికారులు తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hindu Temple Demolished
Pakistan
Khyber Pakhtunkhwa Province

More Telugu News